తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఖరారయ్యాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ అసెంబ్లీ సమావేశాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో రేవంత్ ప్రభుత్వ ఏడాది పాలన, రైతు రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇక, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సైతం ప్లాన్ వేస్తున్నాయి. గురుకుల పాఠశాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, వికారాబాద్ జిల్లాలో లగచర్ల ఘటన, రైతు భరోసా, ధాన్యానికి రూ. 500 బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారే జరిగాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్క రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఆ రోజు సెషన్స్ ముగిసిపోక ముందే వెళ్లిపోయారు. ఈ సారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అనేది ఉత్కంఠ రేపుతుంది. ఒక వేళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే కాంగ్రెస్ సర్కార్ ప్రతిచర్య ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది.