తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. నల్ల చొక్కాలు, చేతికి సంకెళ్లు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే లగచర్ల ఘటనలో రైతులకు సంకెళ్లు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్ష బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావుతో పాటు ఎమ్మెల్యేలంతా నల్లచొక్కాలు, చేతికి బేడీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. ‘ఇదిగో రాజ్యం, ఇదిగో రాజ్యం, లాటి రాజ్యం, దోపిడి రాజ్యం, రైతులకు అవమానం’ అంటూ పలు నినాదాలు చేస్తూ అసెంబ్లీలో నిరసన తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో లగచర్ల, దిలావర్పూర్, రామన్నపేటతోపాటు పలు ఘటనలపై అసెంబ్లీలో చర్చ జరపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ, రైతుల అరెస్టులపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ అంశాలపై సభలో చర్చించేందుకు అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పీకర్కు వాయిదా తీర్మానాన్ని సమర్పించారు.