తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అప్పులు, రుణ పరిమితిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఫైర్ అయ్యారు. పైగా చేసిన అప్పులను దాచేసి తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేసిందంతా చేసి తమపైనే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. విపక్ష సభ్యులు సభకు, స్పీకర్కు కనీస గౌరవం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. అసెంబ్లీలో ఎవరైనా రూల్ బుక్ ప్రకారం నడుచుకోవాలని అన్నారు. గత పదేళ్లలో బీఏసీ సమావేశం ఎలా నిర్వహించారో మర్చిపోయారా? అంటూ ఆయన చురకలంటించారు. గతంలో పాటించిన నిబంధనలే ఇప్పుడు తాము పాటించాలి కదా అని డిప్యూటీ సీఎం సెటైర్లు వేశారు.