దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని తేల్చడానికి మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లోని 13, 766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేయనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా, తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఓటింగ్లో 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు ఓటు వేయనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరుగుతోంది. అన్ని స్థానాల్లో అధికార ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. 30 వేల మంది పోలీసులు, 220 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 3000 వేల హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉన్నారు.