రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్‌ అనుబంధ సంస్థ అయిన జేఎస్‌డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్‌ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని, ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలతో పాటు డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం రక్షణ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *