మూసీ నిద్ర అంటే మూసీ కాలువ సమీపంలో నిద్రించాలి కానీ, ఏసీ రూముల్లో కాదని బీజేపీ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. 7న నల్గొండ జిల్లాలో సీఎం పర్యటన దృష్ట్యా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లం వద్ద హెలిప్యాడ్ ప్రాజెక్టు పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనను బీజేపీ వ్యతిరేకించడం దురదృష్టకరమన్నారు. 40, 50 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడేందుకే మూసి ప్రక్షాళన అని మంత్రి అన్నారు.
సబర్మతి నది ప్రక్షాళనను స్వాగతిస్తున్న బీజేపీ, మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటుంది? అని ప్రశ్నించారు. బ్రాహ్మణ వెళ్ళంల ప్రాజెక్టుకు వైయస్సార్ శంకుస్థాపన చేశారని మంత్రి అన్నారు. బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున, నా కలల ప్రాజెక్టును ప్రారంభించడం నా అదృష్టం అన్నారు. ఎస్ఎల్బీసీ కాలనీ జనవరిలో ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు.