రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ చిత్రానికి టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలను రద్దు చేశామని చెప్పి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది.
అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజాము షోలకు అనుమతిని ఇవ్వడంపై పునరాలోచించాలని పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వొద్దని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.