ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు ఫ్యామిలీకి సంబంధించి ఓ ఆసక్తికర ప్రచారం జరిగింది. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని, వారిద్దరూ జనసేన పార్టీలో చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ప్రచారంపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీ అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. సోమవారం ఆళ్లగడ్డ వచ్చిన ఆయన దీనిపై మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రవేశంపై మనోజ్ని మీడియా ప్రశ్నించగా ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని చెప్పారు.
ఈరోజు తన అత్తగారి జయంతి అని అందుకే తన కూతురు దేవసేన శోభను తొలిసారిగా ఆళ్లగడ్డకు తీసుకొచ్చానని చెప్పారు. జయంతి రోజున తీసుకురావాలని, ఇన్నాళ్లూ ఇక్కడికి తీసుకురాలేదన్నారు. తమ కుటుంబం, సోదరులు, స్నేహితులతో కలిసి ఇక్కడకు వచ్చామన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకున్నారని అందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పారు.