గతేడాది డిసెంబర్ 4న ‘పుష్ప-2: ది రూల్’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్కు మరో ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో వ్యక్తిగతంగా హాజరుకావాలనే షరతు నుంచి బన్నీకి నాంపల్లి కోర్టు మినహాయింపునిచ్చింది. కాగా, ఐకాన్ స్టార్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కోర్టు ఈ నెల 3న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్లో హాజరు, రూ. 50,000 చొప్పున ఇద్దరు పూచీకత్తులతో పాటు సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఆదివారం బన్నీ స్వయంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేశాడు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అల్లు అర్జున్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన నాంపల్లి కోర్టు ఆయనకు ఈ షరతు నుంచి మినహాయింపు ఇచ్చింది.