తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందుకుగాను తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు నవంబర్ 6వ తేదీ నుంచి సగం రోజు మాత్రమే స్కూల్ ఉండాలని వెల్లడించింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6 నుంచి ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే స్కూళ్లు పనిచేస్తాయి. మధ్యాహ్న భోజనం అయిపోయిన తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్లిపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణనను సులభతరం చేయడానికి ఏకంగా 80,000 మంది సిబ్బంది పాల్గొంటారు. అన్ని ప్రభుత్వ పాఠాశాల టీచర్లు ఒక మూడు వారాలపాటు కులగణనకి పని చేస్తారని, అందుకే ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్నం వరకే పనిచేస్తాయని పేర్కొంది. అయితే, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్జీటీలను ఎన్యుమరేటర్ విధులకు దూరంగా ఉంచింది. దీంతో హైస్కూళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3,414 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సేవలను కుల గణనకు వినియోగించుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది . అలాగే, 6,256 మంది ఎమ్మార్సీ సిబ్బంది, టైపిస్ట్ రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడెర్లో ప్రభుత్వ, ఎంపీపీ, జడ్పీపీ, ఎయిడెడ్ స్కూళ్ల నుంచి దాదాపు 2 వేల మంది మినిస్టీరియల్ సిబ్బందిని సర్వేకు వినియోగించుకుంటున్నట్టు వివరించింది.