అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులకు జో బిడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడి కంపెనీలు విదేశీ నిపుణులను సులభంగా నియమించుకునేలా నిబంధనలు మార్చారు. అలాగే, ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకునేందుకు అనుమతినిచ్చింది. ఫలితంగా లక్షలాది మంది భారతీయ నిపుణులు ప్రయోజనం పొందుతారు. అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసా సహాయంతో విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. ఈ వీసా ద్వారా భారత్, చైనా దేశాలు భారీగా లబ్ధి పొందుతున్నాయి.
ఈ నేపథ్యంలో యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నిబంధనలలో మార్పులు చేసి అక్కడి కంపెనీలకు అవసరాల మేరకు విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశం కల్పించింది. ఈ కొత్త విధానం ప్రకారం, లేబర్ కండిషన్ అప్లికేషన్ ఖచ్చితంగా హెచ్-1బీ వీసా పిటిషన్తో సమానంగా ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో ఎన్. మేయోర్కాస్ మాట్లాడుతూ, తాజా మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకునేందుకు యజమానులకు అవకాశం లభిస్తుందని అన్నారు.