తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘వర్కర్ టూ ఓనర్’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్‌లో సమావేశమై పథకం అమలుపై చర్చించారు. ఈ పథకం ద్వారా గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్‌ను ఏర్పాటు చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నారు. తొలుత ఈ పథకాన్ని సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. జిల్లాలో సుమారు 5,000 నేత కార్మికులు ఉండగా, అందులో 2,000 మంది తీవ్ర పేదరికంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తొలి దశలో 1,104 మంది కార్మికులను ఎంపిక చేసి వారికి ఓనర్‌షిప్ కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో యూనిట్ విలువ రూ.8 లక్షలు ఉండగా, అందులో 50% సబ్సిడీ, 40% బ్యాంక్ లోన్, 10% లబ్ధిదారుడి వాటాగా నిర్ణయించారు. ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉందని టెస్కో జనరల్ మేనేజర్ అశోక్ రావు తెలిపారు. కార్మికుల ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. పవర్ లూమ్స్ సరఫరా కోసం కొన్ని ప్రైవేట్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. త్వరలో పూర్తిస్థాయిలో అమలు దిశగా మరింత స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *