వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 2025 జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ దర్శనం కల్పించనున్నారు. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల కోసం సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద టీటీడీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, షెడ్లు, బారికేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, భద్రత తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.
కాగా, జనవరి 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనానికి జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి తిరుపతి, తిరుమలలో టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలోని 4 కౌంటర్ల ద్వారా మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. మిగిలిన రోజుల్లో వైకుంఠ దర్శనం కోసం జనవరి 12, 13, 14, 15, 16, 17, 18 తేదీల్లో టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లు ఉన్నవారే దర్శనానికి రావాలని టీటీడీ స్పష్టం చేసింది.