రేపటి నుంచి జనవరి 14 వరకు జరిగే సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి మాసోత్సవాలలో ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన మాసం. ఈ ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి. ధనుర్మాసం నేపథ్యంలో సుప్రభాత సేవలను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. తిరుప్పావైతో నెల రోజుల పాటు శ్రీవారి మేల్కొలుపు ఉంటుంది. దీంతోపాటు, ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు.
మరోవైపు జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 18 కంపార్ట్మెంట్లలో భక్తులకు వసతి కల్పించారు. నిన్న అర్ధరాత్రి వరకు 66,160 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22,724 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.47 కోట్లు భక్తులు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది.